దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రచురితమయ్యే వార్త పత్రికలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న,మధ్య వ్యాపార పత్రికలకు జారీ చేసే ప్రకటనల రేట్లను 25శాతం పెంచింది. ప్రింట్ మీడియాలో ప్రకటన రేట్లు సవరిస్తూ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. 8 వ రేట్ స్ట్రక్చర్ కమిటీ సిఫార్సులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సవరించిన రేట్లు మంగళవారం నుంచి మూడు సంవత్సరాల పాటు అమల్లో వుంటాయని ప్రకటించింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్ కమ్యూనికేషన్ ఒక ప్రకటన జారీ చేసింది. అంతర్జాతీయంగా న్యూస్ ప్రింట్, ప్రాసెసింగ్ చార్జీలు, ఇతర కారణాల రీత్యా ఈ పెంపును చేసినట్టు వెల్లడించింది.
ప్రభుత్వ నిర్ణయం ముఖ్యంగా ప్రాంతీయ మరియు స్థానిక భాషలలోని చిన్నపత్రికలకు ప్రయోజనకరంగా ఉంటుందని పత్రికల యాజమాన్యాలు భావిస్తున్నాయి. అయితే ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ నిర్ణయంపై విమర్శలు గుప్పించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓడిపోతామన్న భయంతో పాలక పార్టీ బీజేపీ వేసిన మరొక ఎత్తుగడగా పేర్కొంది. డబ్బుతో మీడియాను నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఆరోపించారు.