రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏకు ప్రత్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో విపక్షాలు ఓ కీలక నిర్ణయానికి వచ్చాయి. పార్టీలకతీతంగా ఒక్కరిని మాత్రమే రాష్ట్రపతి రేసులో నిలబెట్టాలని విపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి.
ఈ భేటీకి కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీఎస్, ఆర్ఎస్పీ, ఐయూఎంఎల్, ఆర్ఎల్డీ, జేఎంఎం నేతలు హాజరవగా.. ఆద్మీ పార్టీ, టీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ గైర్హాజరయ్యాయి.
ఈ మేరకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన ఈ సమావేశం ముగిసిన అనంతరం మమత బెనర్జీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి అభ్యర్థిని నిలిపే ప్రక్రియకు ఇది నాంది అని చెప్పారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని శరద్ పవార్ను రాష్ట్రపతి అభ్యర్థిగా అంతా ప్రతిపాదించారు. అయితే శరద్ పవార్ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచపోవడంతో. . ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు గోపాలకృష్ణ్ గాంధీ పేర్లను పరిశీలనలో ఉంచినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఈ నెల 21న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.రాష్ట్రపతి అభ్యర్థి కోసం సంప్రదింపులు కొనసాగిస్తామని అన్నారు. దేశంలో పేరుకుపోయిన బుల్డోజర్ రాజకీయాలను అడ్డుకునేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్, బీజేడీ వంటి పార్టీల గురించి మమత మాట్లాడుతూ, వారు ఈ సమావేశంలో పాల్గొనకపోవడం పెద్ద విషయమేమీ కాదన్నారు. ఈ సమావేశానికి చాలా పార్టీలు వచ్చాయని, హాజరుకాని పార్టీల నేతలకు ఇతర కార్యక్రమాలు ఉండి ఉంటాయని చెప్పారు.
కాగా.. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వివిధ పార్టీల నేతలతో మమత బెనర్జీ, శరద్ పవార్, మల్లికార్జున ఖర్గే చర్చలు జరుపుతారని తెలుస్తోంది.