కేంద్ర ఎన్నికల సంఘంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొన్నటి లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఈసీ అధికారులను మెచ్చుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల మన ప్రజాస్వామ్యం విజయవంతమైందన్నారు. చాలా పర్ఫెక్ట్గా ఎన్నికలు నిర్వహించారని ప్రణబ్ కితాబు ఇచ్చారు.
ఎన్నికల కమీషనర్ సుకుమార్ సేన్ నుంచి నేటీ వరకు ఆ పదవిలో ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నికల నిర్వహణను పటిష్టంగా చేపట్టారన్నారు. భారత ప్రభుత్వ వ్యవస్థలన్నీ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయాలనుకుంటే, మన దేశంలో వ్యవస్థలన్నీ సమర్థంగా పనిచేస్తున్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రణబ్ అన్నారు.