మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గత రాత్రి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలుసుకున్న వైద్యులు, ఇతర పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది.శస్త్రచికిత్స విజయవంతమైనా 84 సంవత్సరాల వయసులో ఆయనకు ఇతర అవయవాల పనితీరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచామని న్యూఢిల్లీ అండ్ ఆర్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
నిన్న ఉదయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా ట్వీట్ చేసిన ప్రణబ్ ముఖర్జీ, తనకు కరోనా సోకిందని, గడచిన వారం రోజులుగా తనను కలిసి వారంతా స్వీయ నియంత్రణలోకి వెళ్లి, పరీక్షలు చేయించుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కుదుటపడాలని, ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా కోరుకుంటున్నారు. ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకుంటారన్న నమ్మకముందని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ అన్నారు.