తమ పార్టీ ఆఫీసులోని స్టాంపులు, బీ ఫామ్స్ను ఎవరో దొంగిలించడం వల్లనే అన్నిచోట్ల నామినేషన్లు వేయలేకపోయాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బీ ఫారాలను కొందరు వ్యక్తులు దొంగతనం చేయడంతో తమ పార్టీ తరపున ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను కొన్నిచోట్ల అకారణంగా తిరస్కరించారని ఆయన ఆరోపించారు.
ప్రజాశాంతి పార్టీ పోటీలో లేని స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులెవరైనా ఆసక్తి చూపితే వారిని తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటిస్తామని పాల్ తెలిపారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25ఎంపీ నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటే 75చోట్ల మాత్రమే వేయగలిగామని తెలిపారు. వాటిలో కూడా చాలా నామినేషన్లను అధికారులు తిరస్కరించారని వెల్లడించారు. ఈ విషయం పై ఈరోజు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేయాలని సీఈసీని కోరనున్నట్లు వెల్లడించారు.