తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిన్న హైదరాబాద్ లో సీఎం క్యాంప్ ఆఫీసు ప్రగతిభవన్ ముట్టడికి టీ-కాంగ్రెస్ నేతలు యత్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ ముట్టడి వ్యవహారంపై నేతలు ఎవ్వరికీ సమాచారం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ కార్యాలయంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, వీహెచ్, కోదండరెడ్డి హాజరయ్యారు.
రేవంత్ రెడ్డి ఎవరినీ సంప్రదించి ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమాన్ని ప్రకటించారని పార్టీ సీనియర్లు ప్రశ్నించారు. ప్రగతిభవన్ ముట్టడిపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడాన్ని వారు తప్పుబట్టారు. ఉత్తమ్ తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని భట్టి విక్రమార్క వద్ద నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.