నిజమైన కళాకారుడికి కులం, మతం, ప్రాంతం అనేది పట్టదని, చిత్రపరిశ్రమకి రాజకీయాలు ఇమడవు అని పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ..నేను జనజీవితంలో ఉన్నా కానీ, సినిమా అనేది నాకు అన్నం పెట్టింది. సినిమా లేకపోతే నేను ఈ రోజు ప్రజాసేవలో ఉండే పరిస్థితి ఉండేది కాదు.
ఏదో అయిపోదామని కాదు కానీ.. మన దేశానికి, ప్రాంతానికి, మన రాష్ట్రాలకు, మనవాళ్లకీ ఎంతో కొంత చేయాలని… నాకు వేరే వృత్తి తెలియదు. సినిమానే నాకు డబ్బు సంపాదించుకునే వృత్తి. రాజకీయాల్లో ఉన్నా సినిమాల పట్ల బాధ్యతగానే ఉన్నాను.
‘తొలి ప్రేమ’, ‘ఖుషీ’ తదితర సినిమాలు ఎంత బాధ్యతగా చేశానో, ప్రజాజీవితంలో ఉంటూనే అంతే బాధ్యతగా చేసిన సినిమా ‘భీమ్లానాయక్’.
అహంకారానికీ, ఆత్మగౌరవానికీ మధ్య మడమ తిప్పని యుద్ధమే ఈ సినిమా. ఒక పోలీస్ అధికారికి, కాబోతున్న రాజకీయ నేపథ్యంలో ఉండే వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణను చాలా బాగా రచన చేసిన త్రివిక్రమ్కు కృతజ్ఞతలు తెలిపారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచారని.. ఆయన లేకపోతే ఈ సినిమా లేదన్నారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆనందపరుస్తుంది.
సోదరులు కల్వకుంట్ల తారాక రామారావుగారిని నేను ఆప్యాయంగా రాంభాయ్ అని పిలుస్తాను. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నా తరఫున, నిర్మాతలు, చిత్రయూనిట్ తరఫున కేటీఆర్గారికి ధన్యవాదాలు.
చెన్నైలో ఉండిపోయిన చిత్ర పరిశ్రమని ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్నప్పుడు చెన్నారెడ్డి లాంటి మహనీయులు అనేకమంది పెద్దలు కలిసి హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఈరోజు దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
చిన్నపాటి అవసరం ఉందంటే మంత్రి తలసాని ముందుంటారు. దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్కి ధన్యవాదాలు చెబుతున్నా” అని అన్నారు.