నాలుగు టెస్ట్ సిరీస్ లలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతోంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా దూకుడు ప్రదర్శిస్తోంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. 303/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండవ రోజు ఆట కొనసాగించింది భారత్. విహారి (42) వికెట్ను త్వరగానే కోల్పోయాడు. అయితే ఓవర్నైట్ బ్యాట్స్మెన్ పుజారా రెండో రోజు కూడా నిలకడ ప్రదర్శించాడు. కానీ డబుల్ సెంచరీ చేస్తాడనుకునే సమయంలో 193 పరుగుల వద్ద లియాన్ బౌలింగ్లో అవుటయ్యాడు. మరో ఎండ్లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. 85 బంతుల్లో నాలుగు ఫోర్లతో కెరీర్లో మూడో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. దూకుడుగా ఆడుతూ 128 బంతుల్లో 7 ఫోర్లతో 88 పరుగులతో ఆడుతున్నాడు. పుజారా స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన జడేజా (25 నాటౌట్) పంత్కు సహకరిస్తుండడంతో భారత్ 146 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 491 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో లియాన్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. హాజెల్వుడ్ రెండు, స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇక పూజారా టెస్టు బ్యాటింగ్తో సిరీస్ ఆసాంతం పుజారా నాలుగు టెస్టుల్లో మూడు శతకాలు, ఒక అర్ధ శతకం నమోదు చేశాడు. మొత్తంగా పుజారా 373 బంతుల్లో 22 బౌండరీలతో 193 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో 500 పైచిలుకు పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
పుజారా రికార్డులు
1. ఈ సిరీస్లో 200 అంతకంటే ఎక్కువ బంతులు ఆడడం పుజారాకు నాలుగోసారి. ఆసీస్లో ఓ భారత బ్యాట్స్మన్ ఇన్ని బంతులు ఆడడం ఇదే ప్రథమం.
2. ఆసీస్ గడ్డపై టెస్టు తొలిరోజే అత్యధిక పరుగులు (130 బ్యాటింగ్) సాధించిన నాలుగో భారత బ్యాట్స్మన్ పుజారా. సెహ్వాగ్ (195), విజయ్ (144), గవాస్కర్ (132) ముందున్నారు.
3. ఆసీస్లో జరిగిన సిరీస్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న తొలి భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. ఈ క్రమంలో ద్రావిడ్ (2003-04లో 1203) రికార్డును అధిగమించాడు.
4. ఈ 193 పరుగులతో ఆసీస్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఐదో బ్యాట్స్మన్గా, ఆసియాకు చెందిన ఆరో బ్యాట్స్మన్గా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్(241 నాటౌట్), ద్రావిడ్(233), రవి శాస్త్రి(206), అజార్ అలీ(205 నాటౌట్), సెహ్వాగ్(195) అతడికంటే ముందున్నారు.