telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఢిల్లీ కాలుష్యం దేశవ్యాప్తంగా వ్యాపిస్తుందా .. తెలుగు రాష్ట్రాలలోను క్షిణిస్తున్న నాణ్యమైన గాలి..

pollution increased in a week in telugu states

కేవలం గత వారం వ్యవధిలోనే గాలి నాణ్యత సూచీ దాదాపు రెండింతలు పెరిగింది. ‘సంతృప్తి’ స్థితి నుంచి ‘మధ్యస్తం’కు చేరింది. ఆస్తమా, గుండె సంబంధ సమస్యలున్న వారిపై ఈ వాయు కాలుష్యం ప్రభావం చూపుతుందని, వారు జాగ్త్రతలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో కాలుష్య తీవ్రత పెరిగి స్వచ్ఛమైన గాలి తగ్గిపోతుంది. కాలుష్య తీవ్రత నవంబరు 1న తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో సంతృప్తికర (51-100) స్థితిలో ఉంది. 7నాటికి మధ్యస్థానికి (101-200) చేరుకుంది. హైదరాబాద్‌, తిరుపతి, రాజమహేంద్రవరంలో రెండింతలు.. అమరావతిలో రెండున్నర రెట్లు వాయు కాలుష్యం పెరిగింది. డిసెంబరు, జనవరి నెలల్లో ఈ తీవ్రత మరింత అధికమయ్యే అవకాశాలున్నాయి. ఏక్యూఐ 200 (కాలుష్యం ఎక్కువ) దాటిన నగరాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సూచీ 301 దాటితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. 400 ఉంటే అత్యంత దారుణ పరిస్థితి ఉన్నట్లు భావిస్తున్నారు. దిల్లీలో ఈ నెల 3న 494 వరకు నమోదైంది.

దేశవ్యాప్తంగా చూస్తే గాలి నాణ్యత సూచీ (నవంబరు 7న)- మొరాదాబాద్‌లో అత్యధికంగా 435, లఖ్‌నవూ, కాన్పూర్‌లో 366, పట్నాలో 378, ముజఫరాబాద్‌లో 341, నోయిడాలో 318, దిల్లీలో 309గా నమోదైంది. పరిశ్రమల, వాహన కాలుష్యం, చెత్తను కాల్చడం వంటి కారణాలతో సూక్ష్మధూళికణాలు(పీఎం 10), అతిసూక్ష్మ ధూళికణాలు (పీఎం 2.5), నైట్రోజన్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌, ఓజోన్‌ వంటి కాలుష్య ఉద్గారాలు గాలిలో కలుస్తుంటాయి. సాధారణ రోజుల్లో అయితే ఈ ఉద్గారాలు గాలిలో చెల్లాచెదురు అయిపోతుంటాయి. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు, గాలిలో తేమ ఉన్నప్పుడు కాలుష్య ఉద్గారాలు విడుదలైన ప్రాంతంలోనే కదలకుండా ఉండిపోతాయి. ఫలితంగా గాలి నాణ్యత క్షీణించడంతో పాటు పీల్చినవారికి ఆరోగ్యసమస్యలు మొదలవుతాయి. ఆస్తమా, సీఓపీడీ వంటి జబ్బులున్నవారిపై వాయుకాలుష్యం ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ కాలుష్యం ఉన్నరోజుల్లో ఈ రోగులకు ఎక్కువ డోస్‌తో మందులు ఇవ్వాల్సి వస్తోంది. వాయుకాలుష్యం కారణంగా శ్వాసకోశ జబ్బుల రోగుల సంఖ్య పెరుగుతోంది. తీవ్రతను బట్టి కొన్నిసార్లు వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. పిల్లలు, వృద్ధులపై వాయుకాలుష్య ప్రభావం ఎక్కువ. బ్రాంకైటీస్‌, ఆస్తమా, వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వంటివి ఎక్కువ వస్తాయి. ఇతరులకు వ్యాపించే అవకాశమున్నందున ఇన్ఫెక్షన్‌ ఉన్న రోగులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ వయసువారైనా సరే.. దుమ్ము ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్‌-95 పొల్యుషన్‌ మాస్క్‌లు దరిస్తే కాలుష్యం నుంచి కొంత రక్షణ లభిస్తుంది.

Related posts