telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అమెరికాలో ప్రారంభమైన పోలింగ్..

యూఎస్ లో పోలింగ్ మొదలైంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే అమెరికన్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. అమెరికా భవిష్యత్‌కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు కీలకం. పోలింగ్ పూర్తైన వెంటనే కౌంటింగ్ మొదలైనా తుది ఫలితం రావడానికి టైమ్ పట్టే అవకాశముంది. ఈశాన్య రాష్ట్రమైన న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లీ నాచ్ గ్రామంలో మంగ‌ళ‌వారం తెల్లవారుజామున ప్రజ‌లు ఓటేశారు. ఆ గ్రామంలో మొత్తం 12 మంది మాత్రమే ఉన్నారు.  వీరిలో ఐదుగురే ఓటు వేశారు. ఈ ఐదు ఓట్లు బైడెన్ ఖాతాలో పడ్డాయి. ట్రంప్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. డిక్స్‌విల్లీ గ్రామ‌స్తులు ఏక‌ప‌క్షంగా డెమోక్రటిక్ అభ్యర్థికి ఓటేశారు.  అమెరికా- కెనడా సరిహద్దుల్లో ఉన్న అడ‌వుల్లో డిక్స్‌విల్లీ గ్రామం ఉంది.  1960 నుంచి సాంప్రదాయ‌బ‌ద్దంగా ఈ గ్రామం నుంచే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలవుతోంది.

డిక్స్‌విల్లీకి స‌మీపంలోని మిల్స్‌ఫీల్డ్‌లో కూడా అర్థరాత్రే ఓటింగ్‌ జరిగింది. మిల్స్‌ఫీల్డ్‌లో ట్రంప్‌కు 16 బైడెన్‌కు అయిదు ఓట్లు వచ్చాయి.  గ‌త ఎన్నికల్లో డిక్స్‌విల్లీ గ్రామ ఓట‌ర్లు హిల్ల‌రీ క్లింట‌న్‌కు ఓటేశారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో ట్రంప్ విజ‌యం సాధించారు. ఈసారి కూడా ఈ గ్రామస్తులు బైడెన్‌కు ఓటు వేశారు. న్యూ హ్యాంప్‌షైర్‌లోని మున్సిపాల్టీల్లో వంద క‌న్నా త‌క్కువ నివాసితులు ఉన్న గ్రామాల్లో అర్థరాత్రే పోలింగ్ ప్రారంభం అయింది. రిజిస్టర్డ్ ఓట్లు పోలైన వెంట‌నే పోలింగ్‌ బూత్‌ల‌ను మూసివేశారు. అమెరికాలోని తూర్పు తీర ప్రాంతంలో ఉన్న పోలింగ్ స్టేష‌న్లు అన్నీ ఉద‌యం 6 గంట‌ల‌కు తెరుచుకున్నాయి. అమెరికాలో జ‌రిగిన ముంద‌స్తు ఓటింగ్‌లో ఇప్పటికే ప‌ది కోట్ల ఓట్లు పోల‌య్యాయి.

Related posts