పెళ్ళికొడుకు ఒక పేరు మోసిన గ్యాంగ్ స్టర్, రెండు, మూడు హత్య కేసుల్లో నిందితుడు. ఆమె మంచి పేరున్న పోలీసు. పనిచేసే స్టేషన్లో ఉత్తమ పోలీసుగా ప్రశంసలు కూడా దక్కించుకుంది. కానీ, గ్యాంగ్స్టర్ను తొలిసారి కోర్టులో చూసి ఫిదా అయ్యింది. తానో బాధ్యతగల పోలీసు, ఆయనో కిరాతక రౌడీ అన్న విషయం మర్చిపోయి ఆయనతో ప్రేమలో పడింది. ఇటీవల అతడిని పెళ్లి కూడా చేసుకున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు వైరల్గా మారాయి. ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడాకు చెందిన పాయల్ అనే పోలీసు అధికారిణి 2014 మే 9న రాహుల్ థరాసనా అనే గ్యాంగ్స్టర్ను కలిసింది. మన్మోహన్ గోయల్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో అతడు నిందితుడు.
ఆ కేసు విచారణ జరుగుతున్న సమయంలో సూరజ్పూర్ కోర్టులో పాయల్, రాహుల్ కలుసుకున్నారు. అప్పటి నుంచి ఆమె రాహుల్తో మాట్లాడుతుండేది. అతడు జైల్లో ఉన్నా, బయట ఉన్నా మాట్లాడేది. తాజాగా వీరిద్దరూ పెళ్లి వస్త్రాల్లో ఉన్న ఫొటోలను రాహుల్ కొందరితో పంచుకున్నాడు. ఇవి కాస్తా వైరల్ అయ్యాయి. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. అయితే ఆ ఫొటోలో ఉన్నది పోలీసు కానిస్టేబుల్ పాయలా? కాదా? ధ్రువీకరించాల్సి ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు చెప్పారు.