ఐటీ గ్రిడ్ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఏపీ ప్రజలకు చెందిన వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటాబేస్ చోరీకి గురైందని లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటీ గ్రిడ్ యజమాని ఆశోక్ కోసం సైబరాబాద్ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వ లబ్దిదారుల సమాచారం లీకైందని వైసీపీ జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి గత నెల 22న సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆశోక్కు ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఐటీ గ్రిడ్ సంస్థ సేకరించిన సమాచారాన్ని అమెజాన్ సర్వీసెస్లో హోస్ట్ చేస్తున్నట్లు గుర్తించామని సైబరాబాద్ సీపీ ప్రకటించారు. ఈ కేసు విషయమై ముందుగానే అశోక్ కు లీకైనట్టుగా తెలుస్తోంది. ఈ సమాచారం లీక్ కావడంతో ఆశోక్ మూడు కీలకమైన హార్డ్ డిస్క్లను తీసుకొని ఆశోక్ పారిపోయినట్టుగా చెబుతున్నారు. ఆశోక్ ఏపీ పోలీసుల ఆధీనంలో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆశోక్ దొరికితేనే ఈ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని సైబరాబాద్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు.