telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులకు హైకోర్టు బ్రేక్!

polavaram

పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను ఈరోజు విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది. దీనికి తోడు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ, పనులు నిలిచిపోతే అన్ని విధాలుగా నష్టం వాటిల్లుతుందని కోర్టుకు విన్నవించారు. వరదలు మళ్లీ మొదలైతే పనులు చేపట్టడం కష్టమవుతుందని చెప్పారు. అయితే, ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. మరో 15 రోజులు పనులు నిలిచిపోయినా ఎలాంటి నష్టం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.

మరోవైపు, పోలవరం పనుల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవయుగ సంస్థకు కట్టబెట్టిన హైడల్ ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసి ప్రభుత్వం ఆ కాంట్రాక్టును మేఘా సంస్థకు అప్పగించింది. గత శుక్రవారం స్పిల్ వే పనులను కూడా మేఘా సంస్థ ప్రారంభించింది. ఇలాంటి తరుణంలో పనులపై హైకోర్టు స్టే విధించడం గమనార్హం.

Related posts