ఉత్తరప్రదేశ్ అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు నేడు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి హిందీలో వరుసగా మూడు ట్వీట్లు చేశారు. అయోధ్య కేసులో సుప్రీం తీర్పును ఎవరి గెలుపోటముల అంశంగానూ చూడకూడదని అన్నారు. ‘‘అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వస్తోంది. గత కొద్ది నెలలుగా ఈ వ్యాజ్యంపై సుప్రీం కోర్టు తరచుగా వాదనలు విన్నది.
ఈ సమయంలో సమాజంలోని అన్ని వర్గాలూ సద్భావనతో మెలిగేందుకు చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయం. దేశంలో శాంతి, సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని నెలకొల్పేందుకు.. సమాజంలోని అన్ని వర్గాలూ చేసిన కృషి స్వాగతించదగ్గది. కోర్టు తీర్పు తర్వాత కూడా మనమంతా కలిసి ఇదే సామరస్యాన్ని కొనసాగించాలి. అయోధ్యపై ఎలాంటి తీర్పు వచ్చినా అది ఎవరి గెలుపు, ఓటములకు సంబంధించిన విషయం కాదు’ అని పేర్కొన్నారు.