ప్రముఖ టాలీవుడ్ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు నిలిచిపోవడంతో జయప్రకాశ్ రెడ్డి కొంతకాలంగా గుంటూరులోని తన నివాసంలోనే ఉంటున్నారు. ఈ తెల్లవారుజామున ఛాతీలో నొప్పితో బాత్రూంలోనే కుప్పకూలిపోయారు. జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
జయప్రకాశ్ రెడ్డి మృతిపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. జయప్రకాశ్ రెడ్డి గారు తనదైన నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారని తెలిపారు. తన దీర్ఘకాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారని పేర్కొన్నారు. వారి మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. జయప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.