ఉగ్రవాద చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం అనంత్నాగ్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గుల్ మహ్మద్ మిర్ను శనివారం ఆయన ఇంటివద్దే ముష్కరులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మోదీ తీవ్రంగా స్పందించారు .దేశంలో ఉగ్రవాదానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు.
అమానుష చర్యలతో దేశంలో భయాందోళన సృష్టించాలని ప్రయత్నించే ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. జమ్ము కశ్మీర్లో బీజేపీ బలోపేతానికి గుల్ అహ్మద్ కృషి మరువలేనిదని, ఆయన సేవలు చిరకాలం గుర్తుంటాయని వ్యాఖ్యానించారు. ఈ కష్టకాలంలో గుల్ అహ్మద్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.