ప్రస్తుతం ప్లాస్మా థెరపీ ద్వారా కరోనాకు చికిత్స చేయవచ్చని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స పొందుతున్న ఓ కరోనా పేషెంట్ మృతి చెందాడు. ఈ ఘటన ముంబాయి మహానగరంలో జరిగింది. లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరోనా బాధితుడు చనిపోయారు. ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స పొందిన తొలి మహారాష్ట్ర వ్యక్తి ఈయనే కావడం గమనార్హం. గత నెల 29న ఆయన చనిపోయారు.
ఆసుపత్రివర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం 53 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమించిన పరిస్థితులో హాస్పిటల్ లో చేరారు. చాలా రోజుల పాటు ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించాం. చివరి నాలుగు రోజులు ప్లాస్మా థెరపీ చేశాం. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ నుంచి సేకరించిన ప్లాస్మాను (200 మి.లీ. డోసు) ఆయనకు ఎక్కించాం. ఇతర చికిత్సలేవీ ఫలితం ఇవ్వకపోవడంతో… చివరి ప్రయత్నంగా ప్లాస్మా థెరపీ చేశాం. అయినప్పటికీ రోగి మృత్యువాతపడినట్టు ఆసుపత్రివర్గాలు వెల్లడించాయి.