పాకిస్థాన్ లోని కరాచీ సమీపంలో విమాన ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కి చెందిన ప్రయాణికుల విమానం కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 4 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలింది. ఈ ఎయిర్ బస్ ఏ-320 విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో 98 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని తెలుస్తోంది.
విమానంలో ఉన్నవారిలో 91 మంది ప్రయాణికులు కాగా, ఏడుగురు విమాన సిబ్బంది. ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా, విమానం ఒక్కసారిగా అదుపుతప్పి విమానాశ్రయం సమీపంలోని జిన్నా గార్డెన్ ఏరియాలో ఇళ్లపై కూలిపోయింది. ఈ ఘటనలో అనేక ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పాక్ క్విక్ రియాక్షన్ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.