వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ‘మర్డర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ఫాదర్స్ డే సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కుటుంబ కథా చిత్రమ్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో అమృత పాత్రలో ఆవంచ సాహితి, మారుతిరావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు. దీనికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తొలి ట్రైలర్ గత మంగళవారం విడుదలై నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉందని నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి తెలిపారు. దాదాపు 70 లక్షల మంది ఈ ట్రైలర్ ను చూశారని, త్వరలో మరో ట్రైలర్ ను, రెండో పాటను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలు ఓపెన్ చేసిన తర్వాత విడుదల చేస్తామని వారు వివరించారు. ఆగస్ట్ నెలలో సినిమా తొలికాపీ సిద్ధమవుతుంది. ఆదే నెలలో సెన్సార్ కు పంపుతాం అని నిర్మాతలు వెల్లడించారు. తాజాగా పిల్లల్ని ప్రేమించడం తప్పా…? అంటూ సాగే పాటను మంగళవారం ఉదయం రాంగోపాల్ వర్మ విడుదల చేశారు.