శాంతియుత జీవనంతో ఇలలో కలలు సాకారం అవుతాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత అన్నారు. ఢిల్లీలో ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కాంపాక్ట్ (యూఎన్జీసీ) ఇండియన్ లోకల్ నెట్వర్క్ నిర్వహించిన లింగసమానత్వ సదస్సులో ఆమె ప్రసంగించారు. స్త్రీ, పురుషులకు సమానత్వం ఉండే ప్రతి జాతిలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని ఆమె పేర్కొన్నారు. లింగ సమానత్వం సాదించిన నాడే భూలోకం స్వర్గమయమవుతుందని వివరించారు.
పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులు, సమానత్వంపై దృష్టిసారించకపోతే ప్రపంచంలో సుస్థిర అభివృద్ధి సాధ్యంకాదని చెప్పారు. మహిళలు, పురుషులు వేర్వేరు లక్షణాలతో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు ఉన్నతులు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అంతర్జాతీయంగా మానవ హక్కులు, కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, అవినీతికి వ్యతిరేకాంగా పోరాడాలని కవిత పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్, ఇండియా, భూటాన్, మాల్దీవుల ప్రతినిధులు పాల్గొన్నారు.