హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. సిటీలోని అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో రహదారులపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. మోకాల్లోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే..ఈ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వరదలు రావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదనీరు పోయే దారిలేక, నిత్యావసరాలు దొరక్క అల్లాడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో 30 మందికి పైగా మృతి చెందారు.
ఇదే క్రమంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఉప్పల్ ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా హయత్నగర్ డివిజన్ పరిధిలోని రంగనాయకులగుట్టలో కార్పొరేటర్ తిరుమలరెడ్డిపై స్థానికులు దాడి చేశారు. నాలా భూముల కబ్జాపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చి సమీపంలోని నాలా కబ్జాకు గురవడంతో వరదనీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోందని కార్పొరేటర్ను నిలదీశారు.