తనకు ప్రాణభయముందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. చంద్రబాబే రఘురామకృష్ణంరాజుతో మాట్లాడిస్తున్న విషయం అందరికీ తెలుసని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ల్యాటరైట్ గనుల్లో వైసీపీ నేతలు దోచుకున్నారన్నది అసత్యమని స్పష్టం చేశారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. సరస్వతి పవర్ అంశంలో నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ గురించి ప్రస్తావిస్తూ జూలై నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు.