తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తనకు గట్టి నమ్మకం ఉందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సమ్మె విషయమై సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని, అప్పటికీ కేసీఆర్ పట్టించుకోకపోతే ఆర్టీసీ కార్మికులు భవిష్యత్ లో నిర్వహించే కార్యక్రమాలకు తాను పూర్తిగా మద్దతు ఇస్తానని వెల్లడించారు.
27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండడం బాధాకరమైన విషయం అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో ఈ మధ్యాహ్నం తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు పవన్ కల్యాణ్ ను బంజారాహిల్స్ లోని జనసేన కార్యాలయంలో కలిశారు. సమ్మెకు మద్దతుగా నిలవాలని కోరగా, పవన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.