ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల సీట్ల కేటాయింపులలో భాగంగా కొన్ని ప్రణాళికలు ఉంటాయి. దానితో అప్పటివరకు పార్టీ కోసం కష్టించి పనిచేసిన వారిని పక్కన పెట్టాల్సివస్తుంది. దీనితో వారు అసంతృప్తికి లోనై ఆ పార్టీని వీడుతుంటారు. ప్రస్తుతం ఎన్నికల హీట్ తో ఉన్న ఏపీలో కూడా అదే జరుగుతుంది. తాజాగా వైసీపీ, జనసేనలో ఈ తరహా రాజీనామాలు చోటుచేసుకుంటున్నాయి.
వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అమలాపురం పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు వలవల మల్లిఖార్జునరావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, మొదటి నుంచి పార్టీ ఉన్నతి కోసం పని చేశానని చెప్పారు. తాడేపల్లిగూడెంలో పార్టీకి నాయకుడు కూడా లేకపోతే తానే జెండా మోసి సేవ చేశానని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కన్వీనర్ తనను కలుపుకుని పోవడం లేదని, పార్టీ కోసం పని చేసిన వారికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ అధినేత జగన్ అపాయింట్ మెంట్ కూడా దొరకని పరిస్థితి నెలకొందని చెప్పారు. పార్టీలో తనకు గౌరవం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
ఏలూరు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మత్తే బాబి జనసేనలో సామాజికన్యాయం జరగలేదని ఆరోపిస్తూ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఏలూరు పార్లమెంట్ ప్రధాన కమిటీల్లో ఆరు ప్రధాన పదవులను ఒకే సామాజికవర్గానికి కేటాయించారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తనకు కులం, మతం లేదని పవన్ కల్యాణ్ చెబుతుంటారని… కానీ కమిటీల్లో సమన్యాయం చేయకుండా ఒకే సామాజికవర్గానికి పదవులను కట్టబెట్టారని విమర్శించారు. తనవి అంబేద్కర్ ఆశయాలని ఉపన్యాసాల్లో పవన్ చెబుతుంటారని… ఆచరణలో మాత్రం పవన్ లో అవి లేవని అన్నారు.