మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్న కొడుకును ఆ తల్లిదండ్రులు భరించలే సజీవ దహనం చేశారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కడారి మహేష్ చంద్ర (42) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన చంద్ర నిత్యం పెట్టే వేధింపులు భరించలేక రెండు నెలల క్రితమే భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయంది.
అయినప్పటికీ మహేష్ చంద్రలో మార్పు రాలేదు. నిత్యం మద్యం మత్తులో ఉండే మహేష్ చంద్ర తన తల్లిదండ్రులు కడారి ప్రభాకర్, విమలలను కూడా వేధిస్తుండే వాడు. రోజూ తాగివచ్చి కొడుతున్న కొడుకు తీరును తట్టుకోలేకపోయారు. నిన్నరాత్రి ఎప్పటిలాగే తాగివచ్చిన కొడుకు తమమీద చెయ్యి చేసుకోవడంతో ప్రభాకర్ దంపతులు ఎదురు తిరిగారు. అతన్ని పట్టుకుని కట్టేశారు. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. విషయం తెలిసి స్థానికులు వచ్చేసరికే మహేష్ చంద్ర సజీవ దహనం అయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.