telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం… జీవో జారీ

TS-Government

టాలీవుడ్‌లో జరుగుతున్న లైంగిక వేధింపులపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. గత కొంతకాలం నుంచి సినీనటి శ్రీరెడ్డి ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని చేసిన ఆరోపణలపై శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్యానల్ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపింది. ప్యానల్ ఏర్పాటుకు సంబంధించి జీవోను విడుదల చేసింది. జీవో నంబర్ 984 ప్రకారం సినీ నటి సుప్రియ, సినీ నటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను తెలంగాణ ప్రభుత్వం ఈ కమిటీలో టాలీవుడ్‌ ప్రతినిధులుగా నియమించింది. నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మిలతో ఈ కమిటీ ఏర్పాటైంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు, నిర్మాతదర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకనిర్మాత సుధాకర్ రెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు. రాంమోహన్ రావు ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు నిర్భయంగా చెప్పవచ్చని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ ప్రకటించింది. ఈ విషయంపై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Related posts