72 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ లో మూతపడిన ఓ పురాతన హిందూ ఆలయం తిరిగి తెరచుకోనుంది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన దేవాలయానికి మళ్లీ మహర్దశ రాబోతోంది. పాకిస్థాన్ లోని సియాలో కోట్ లో ఈ పురాతన ఆలయం ఉంది. సర్దార్ తేజా సింగ్, ఈ షావాలా తేజాసింగ్ ఆలయాన్ని నిర్మించారు. భారత్, పాక్ విభజన సమయంలో 72 ఏళ్ల క్రితం ఈ ఆలయం మూతపడింది. భారత్ లో బాబ్రీ మసీదును కూల్చివేసిన అనంతరం… 1992లో ఓ గుంపు ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఈ ఆలయం వద్దకు హిందువులు రావడం ఆపేశారు.
ఈ ఆలయాన్ని మళ్లీ తెరవాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు ఆలయాన్ని తెరవాలని నిర్ణయించినట్టు పాక్ మీడియా వెల్లడించింది. ఆలయంలో దెబ్బతిన్న భాగాలను పునరుద్ధరించాలని కూడా పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయాన్ని పరిరక్షించే పనులను కూడా ప్రారంభించబోతోంది. త్వరలో ఈ ఆలయంలో పున:దర్శనాలు ప్రారంభం కానున్నాయి.