పాకిస్థాన్లో హిందూ మహిళ ఏఎస్సైగా ఉద్యోగం సంపాదించి రికార్డ్ సృష్టించింది. పోలీస్ ఉద్యోగం సాధించిన తొలి హిందూ యువతిగా చరిత్ర సృష్టించింది. పుష్పా కొల్హి అనే యువతి ఇటీవల సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఏఎస్సైగా ఎంపికైంది. ఆమెకు సింధ్ ప్రావిన్స్లో పోస్టింగ్ ఇచ్చినట్టు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. మానవ హక్కుల కార్యకర్త కపిల్ దేవ్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
పాకిస్థాన్లో పోలీస్ ఉద్యోగం సాధించిన తొలి హిందూ యువతిగా పుష్ప రికార్డులకెక్కారని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో సుమన్ పవన్ బోదాని అనే హిందూ మహిళ సివిల్ మేజిస్ట్రేట్గా నియమితులై సంచలనం సృష్టించారు. ఇప్పుడు పుష్ప పోలీస్ అధికారిగా ఎంపిక కావడం విశేషం.