ప్రపంచ కప్ లో భాగంగా పాక్-ఆఫ్గనిస్తాన్ పోటీపడగా, పాక్ కస్టపడి గెలిచి..ఊపిరి పీల్చుకుంది. లీడ్స్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో పాక్ జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ ఆపసోపాలు పడింది. చివరి వరుస బ్యాట్స్ మన్ ఇమాద్ వాసిం (49) వహాబ్ రియాజ్ (15) చలవతో మరో రెండు బంతులు మిగిలుండగా పాక్ గట్టెక్కింది.
ఆఫ్ఘనిస్థాన్ చివరివరకు పోరాడినా, అనుభవలేమి ఆ జట్టుకు ప్రతిబంధకంగా మారింది. చివరి ఓవర్లో సమీకరణం 6 బంతుల్లో 6 పరుగులు కాగా, ఆఫ్ఘన్ కెప్టెన్ గుల్బదిన్ నయిబ్ బౌలింగ్ కు దిగి ఫుల్ టాస్ లు విసరడంతో పాక్ పని సులువైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 227 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కూడా ఆఫ్గనిస్తాన్ ధీటుగానే ఆటను ప్రదర్శించింది, ఒక్కమాటలో చెప్పాలంటే, పాక్ కు చెమటలు పట్టించింది. ప్రపంచ కప్ లో మొదటిసారి అడుగుపెట్టినా, ఆఫ్గనిస్తాన్ పాయింట్ల పట్టికలో చిట్టచివర ఉన్నా కూడా.. చాలా టీం ల కంటే మేలుగానే ఆడుతుంది. ఖచ్చితంగా ఆఫ్గనిస్తాన్ తరువాతి ప్రపంచ కప్ కి మెరుగైన ప్రదర్శనతో ధీటుగా సిద్ధం కాగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.