కశ్మీర్ పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాక్ ఇంకా అక్కసుతోనే రగిలిపోతుంది. ఎప్పుడైనా భారత సైనికులపై దాడులు నిర్వహించేందుకు పాక్ కుట్రలు పన్నుతోంది. సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాక్ ఆర్మీ ఇప్పటికే దాదాపు 100కు పైగా ప్రత్యేక సర్వీస్ బృందాల(ఎస్ఎస్జీ) కమాండోలను మోహరించింది. దీనికి సంబంధించిన విషయాలను భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దుల్లో పాక్ ఎస్ఎస్జీ కమాండోలు చేస్తున్న కార్యకలాపాల్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, వారు జైషే, ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా పనిచేస్తున్నారని తెలిపారు.
ఇప్పటికే ఆఫ్గన్కు చెందిన 12 మంది జిహాదీలను జేషే సంస్థ లీపా వ్యాలీలోకి దింపినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. ఆ ఉగ్రవాదులు భారత లక్ష్యాలపై దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జేఈఎం అధినేత మసూద్ అజర్ సోదరుడు రవూఫ్ అజర్ ఆగస్టు 19, 20 తేదీల్లో బహవల్పూర్లో ఉగ్రవాదులతో సమావేశం నిర్వహించారు. దీంతో ఉగ్రవాదులు భారత్లోని ముఖ్య నగరాల్లో విధ్వంసాలు సృష్టించేందుకు సరిహద్దుల్లో సిద్ధమైనట్లు తెలిపారు.