పాక్ ఫాస్ట్ బౌలర్ వాహబ్ రియాజ్ మరో రెండు వారాల్లో ఇంగ్లాండ్లో ఆరంభమయ్యే ప్రపంచకప్లో టీమిండియా సెమీఫైనల్స్కు చేరుతుందని అంటున్నాడు. ప్రపంచకప్ నేపథ్యంలో ఏయే జట్లు సెమీఫైనల్స్కు వెళతాయో ఇప్పటికే పలువురు మాజీలు, వర్తమాన క్రికెటర్లు పేర్కొన్నారు. తాజాగా పాక్ లెఫ్ట్ఆర్మ్ పేసర్ వాహబ్ రియాజ్ తన అభిప్రాయం వెల్లడించాడు. ఓ మీడియాతో మాట్లాడుతూ భారత్, పాక్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్కు చేరతాయన్నాడు. పాక్ జట్టు విజేతగా నిలవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలో పాకిస్థాన్ ప్రపంచకప్ గెలిస్తే చూడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సారి తమ జట్టు బలంగా ఉందని మెగా టోర్నీలో మంచి ప్రదర్శన కనబరుస్తుందని తెలిపాడు.
పాక్ జట్టు ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్లో ఆరోస్థానంలో ఉంది. చివరిగా ఇమ్రాన్ఖాన్ సారథ్యంలో 1992లో ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టు ప్రపంచకప్ను ముద్దాడింది. పాక్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్తో ఐదు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే 3-0తో వెనుకంజలో ఉన్న జట్టు మిగిలిన రెండు మ్యాచులను గెలిచి పరువు నిలుపుకోవాలని ఉంది. 2019 ప్రపంచకప్లో మే 31న వెస్టిండీస్తో తొలి మ్యాచ్ ఉండగా ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్తో జూన్ 3న రెండో మ్యాచ్ ఆడనుంది.