73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 2022 గానూ 128 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి పద్మ అవార్డులు వరించినవారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏడుగురు ఉన్నారు.. మొత్తంగా ఏడుగురు తెలుగువారు పద్మ అవార్డులు దక్కించుకున్నారు.. అందులో నలుగురు తెలంగాణకు చెందినవారు కాగా.. ముగ్గురు ఏపీవారున్నారు..
తెలంగాణ నుంచి కిన్నెర మెట్ల మొగులయ్య, సకిని రామచంద్రయ్య, గడ్డం పద్మజారెడ్డిలు ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్ ఆదినారాయణ రావు, హసన్ సాహెబ్, గరికపాటి నరసింహారావులు ఉన్నారు.
తెలంగాణ నుంచి పద్మ అవార్డు అందుకున్న వారిలో…
12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య ..
పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దర్శనం మొగిలయ్య నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన వారు. పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆయన ఆఖరితరం కళాకారుడు. గ్రామీణ నేపథ్యంలో దశాబ్దాలుగా ఈ కళను నమ్ముకొని జీవించడంతో పాటు దానికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు యత్నిస్తున్నారు.
డోలు కళాకారుడు సకిని రామచంద్రయ్య..
కోయదొరల ఇలవేల్పు కథకుడు సకిని రామచంద్రయ్యను ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం వరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన ఆయన గిరిజన వన దేవతలైన సమ్మక్క-సారలమ్మల జీవిత చరితను డోలి (డోలు) సాయంతో కోయ భాషలో అద్భుతంగా వర్ణిస్తారు. దాన్ని తెలుగులో పాటగా అందంగా మారుస్తారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర సమయంలో అందరికీ గుర్తుకొస్తారీయన.
వనదేవతల చరిత వినాలనుకునే వారంతా ఇయన వద్దకు వచ్చి వివరాలు తెలుసుకుంటారు. కోయభాషకు అక్షర రూపం తీసుకురావాలని 2015లో అప్పటి భద్రాచలం ఐటీడీఏ పీఓ దివ్య ఆధ్వర్యంలో తోగ్గూడెంలో ఐదుగురు విశ్వవిద్యాలయాల ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సును నిర్వహించారు. ఇందులో సకిని ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
కూచిపూడి నృత్య కళాకారిణి పద్మజారెడ్డి..
కూచిపూడి నృత్య కళాకారిణి గడ్డం పద్మజారెడ్డికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. 1967లో ఏపీలో కృష్ణా జిల్లా పామర్రులో ఆమె జన్మించారు. తండ్రి జీవీరెడ్డి వైద్యుడు, తల్లి స్వరాజ్యలక్ష్మి గృహిణి.. ఆమె నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కేశ్పల్లి (గడ్డం) గంగారెడ్డి చిన్నకోడలు.. దేశ విదేశాల్లో ఆమె అనేక ప్రదర్శనలిచ్చారు. నృత్య విశారద, కల్కి కళాకార్, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు కూడా అందుకున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సంగీత నాటక అకాడమీ, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న తొలి మహిళా కళాకారిణిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు..
కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకు సంయుక్తంగా పద్మభూషణ్..
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మ్యాడిసన్ నుంచి మాలిక్యులార్ బయాలజీలో పీహెచ్డీ చేసిన కృష్ణ ఎల్లా.. తర్వాత సౌత్ కరోలినా మెడికల్ యూనివర్సిటీలో రీసెర్చ్ ఫ్యాకల్టీగా పనిచేశారు. మానవాళి ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు టీకాలు అభివృద్ధి చేయడమే పరిష్కారమని ఆయన నమ్ముతారు.. ఈ క్రమంలోనే స్వదేశం మీద మక్కువతో కుటుంబంతో సహా వెనక్కి వచ్చారు.. భార్య సుచిత్ర ఎల్లాతో కలిసి 1996లో హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్ను స్థాపించారు.. హెపటైటిస్-బీ టీకాతో మొదలుపెట్టి ఎన్నో వ్యాధులకు టీకాలు ఆవిష్కరించారు. ముఖ్యంగా కరోనా మహమ్మారికి ‘కొవాగ్జిన్’ టీకా రూపొందించే క్రమంలో ఆయన చూపిన చొరవ, ప్రభుత్వంతో కలిసి పనిచేసిన తీరు, ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలతో కలిసి నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగిన విధానం.. టీకాను వేగంగా ఆవిష్కరించేందుకు దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే ఆ దంపతులకు పద్మభూషణ్ అవార్డుకు సంయుక్తంగా ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మ అవార్డు అందుకున్న వారిలో…
పోలియో బాధితులను నడిపించారు…
పోలియో బాధితులకు సేవలు అందిస్తున్న డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు (82) విశాఖలో ప్రముఖ వైద్యుడిగా పేరు గడించారు. భీమవరానికి చెందిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో సుంకర శేషమ్మ, కనకం దంపతులకు జన్మించారు. 1961-66లో ఏయూలో ఎంబిబిఎస్ పూర్తిచేశాక, అక్కడే ఆర్థోపెడిక్ సర్జరీలో ఎమ్మెస్ చేశారు. జర్మనీలో శస్త్రచికిత్సలపై శిక్షణ పొందారు.
‘సర్జరీ ఆన్ పోలియో డిజేబిలిటి’ పుస్తకం రాశారు. ఆదినారాయణ రావు కేజీహెచ్లో ఆర్థోపెడిక్ విభాగాధిపతిగా, సూపర్డెంట్, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్, వైద్య విద్యా శాఖ సంచాలకుడిగా సేవలందించారు. ఆయన సతీమణి డాక్టర్ శశి ప్రభ కేజీహెచ్ పర్యవేక్షకగా పని చేస్తున్నారు.
భద్రాద్రి రాముడికి నాదస్వర సుప్రభాత సేవకుడు…
కళాకారుడు హసన్ సాహెబ్ కు పద్మశ్రీ
కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం గోసవీడు గ్రామానికి చెందిన నాదస్వర విద్వాంసులు దివంగత షేక్ హసన్ సాహెబ్ కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయన 93 ఏళ్ల వయసులో 2021 జూన్ లో మరణించారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన సన్నాయి వాయిద్య కళను పుణికి పుచ్చుకున్న హసన్.. కర్ణాటక సంగీతంలో విశేష అనుభవం సంపాదించారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో షేక్ చిన మౌలానా, ప్రకాశం జిల్లా కరువాదికి చెందిన షేక్ చిన మౌలానా వద్ద శిక్షణ పొంది, 1954లో ఆలిండియా రేడియోలో నాదస్వర విద్వాంసులుగా చేరారు. 1981లో భద్రాచలం ఆలయంలో నియమితులయ్యారు. నాదస్వర సుప్రభాతసేవతో భద్రాద్రి సీతారాముల వారికి సేవలు అందించారు. యాదాద్రి ఆలయంలోనూ పని చేశారు.
అవధాన ఘనాపాటి.. గరికపాటి..
అవధాన ప్రక్రియలో ప్రసిద్ధులైన గరికపాటి నరసింహారావు పద్మశ్రీ పురస్కారం వరించింది. ఆయన పుట్టినిల్లు పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం బోడపాడు అగ్రహారం. వెంకట సూర్యనారాయణ, రమణమ్మ దంపతులకు 1958 సెప్టెంబరు 14న జన్మించిన నరసింహారావు ఎంఏ, పీహెచ్ డీ పట్టాలు పొందారు. 30 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. భార్య శారదది తూర్పుగోదావరి జిల్లా. తెలుగు భాష ఉచ్చారణ, వ్యాకరణం, సంప్రదాయ అంశాలపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాహితీ ప్రసంగాలతో మురిపించిన ఆయన దేశవ్యాప్తంగా ఎన్నో సత్కారాలు అందుకున్నారు.
కాకినాడలో స్నేహితులతో మొదట స్నేహితులతో కలిసి కోనసీమ జూనియర్ కాలేజీని స్థాపించారు. తర్వాత సొంతంగా గరికపాటి జూనియర్ కళాశాల నెలకొల్పారు. చైతన్య కళాశాలలో తెలుగు, సంస్కృత ఉపన్యాసకుడిగా పనిచేశాడు. 275 అష్టావధానాలు అవలీలగా నిర్వహించారు గరికిపాటి. ఆయన ‘సాగరఘోష’ అనే పుస్తకాన్ని రచించారు.