తాలిబన్లు కాబూల్లోకి చొచ్చుకొస్తుండటంతో అన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నాయి. తమ ఉద్యోగులు, సిబ్బందిని స్వదేశానికి తరలించేందుకు పెద్ద ఎత్తున విమానాలను సిద్దం చేశారు. ఆర్మీ హెలికాప్టర్లు, విమానాలు అన్నింటిని స్వదేశానికి తరలించేందుకు కాబూల్ ఎయిర్పోర్టులో ఉన్నాయి. చివరకు కాబూల్ లోని అధ్యక్ష భవనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడంతో నగర ప్రజల్లో తమ భద్రతపై తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి.
అయితే, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తొలుత వారి దేశానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బ్రిటన్ తమ వారిని తరలించిన తరువాతే మిగతావారిని తరలిస్తామని చెబుతుండటంతో ఆఫ్ఘన్లు ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో తెలియక భయపడుతున్నారు.
పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు ఏయిర్పోర్టుకు చేరుకోవడంతో ఒకదశలో వారికి కంట్రోల్ చేయడం కష్టంగా మారింది.అనేకమంది మహిళలు, పిల్లల రద్దీతో ఈ ఎయిర్ పోర్టు ఎన్నడూ ఎదుర్కోని పరిస్థితిని ఎదుర్కొంటోంది. అందుబాటులో ఉన్న విమానాలను ఎక్కేస్తుండంతో అమెరికన్ సైన్యం అప్రమత్తరం అయింది. సైన్యం కాల్పులు జరిపినట్టుగా వార్తలు వస్తున్నాయి.
అమెరికన్లు వెంటనే దేశం విడిచి వెళ్లాలని కోరుతున్నామని యూఎస్ ఎంబసీ ఓ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది.అసలే ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ప్రజలకు ఎయిర్పోర్ట్లో ఎదురైన సంఘటనలతో మరింత భయాందోళనలు చెందుతున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఎలాగోలా ఇక్కడి నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు.