కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్తితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ ఆన్లైన్ పాఠాలకు శ్రీకారం చుట్టనుంది. దూదర్శన్ యాదగిరి ఛానెల్ద్వారా పాఠశాల, ఇంటర్మీడియట్ , డిగ్రీ విద్యార్ధులకు ఆన్లైన్ పాఠాలను జూలై 6వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నట్టు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రతిరోజూ 30నిమిషాల పాటు (మధ్యాహ్నం 1.30గం. నుంచి 2గం. వరకు ) ఈ ఆన్లైన్ ప్రసారాలు కొనసాగుతాయని అన్నారు. జూలై 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు డిగ్రీ విద్యార్ధులకు పాఠాలు ప్రసారమవుతాయి. అలాగే జూలై 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ప్రసారం ఉంటుంది. ఇక ఆగస్టు 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ పాఠశాల విద్యార్ధులకు పాఠాలు ప్రసారం అవుతాయని ఆయన తెలిపారు.