ఉల్లి ధర చుక్కలనంతడంతో ఏపీ సర్కారు చర్యలు చేపట్టింది. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర రూ.150లకు చేరిన నేపథ్యంలో ధరల అదుపు పై ప్రభుత్వం దృష్టి సారించింది. రైతు బజారు లో ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతులపై నిషేధం విధించారు. దీంతో రెండు మూడు రోజుల్లో ఉల్లి ధరలు దిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర అవసరాలు తీరకుండా ఎగుమతులపై నిషేధం విధించడంతో దాని ప్రభావం మార్కెట్ పై కనిపిస్తోంది.
కర్నూలులో ఒక దశలో క్వింటాల్ ఉల్లి ధర 12 వేల రూపాయలు దాటింది. అటువంటిది ఈ రోజు 8,600 పలికింది. పలుచోట్ల లారీలతో తరలిపోతున్న ఉల్లిని కూడా అధికారులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉల్లి నిల్వలు పెరిగి మార్కెట్ కు అందుబాటులోకి రానున్నాయి. దీంతో డిమాండ్ మేరకు సరఫరా పెరిగితే ధర తగ్గుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.