ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు కరోనా కేంద్రంగా మారడంతో నేటి నుంచి రెండు వారాల పాటు సంపూర్ణ లాక్ డౌన్ అమలు మొదలైంది. నిత్యావసరాల నిమిత్తం ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ మాత్రమే షాపులు తెరచి ఉంచాలని అధికారులు తెలిపారు. ఆ తరువాత ఎవరైనా కారణం లేకుండా బయటకు వస్తే, కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పట్టణమంతా బోసిపోయింది.
నిన్నటివరకూ కేసులు పెరుగుతున్నా, పరిమిత ఆంక్షలనే అమలు చేస్తూ వచ్చిన అధికారులు, కేసుల సంఖ్య దృష్ట్యా, నేటి నుంచి కఠినమైన ఆంక్షలను విధించారు. కేవలం మెడికల్ షాపులు మాత్రమే తెరవవచ్చని, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని, ఉద్యోగులంతా విధిగా గుర్తింపు కార్డులను దగ్గర పెట్టుకుని మాత్రమే బయటకు రావాలని అధికారులు స్పష్టం చేశారు. మిగతా ఎటువంటి వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.