పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సింగరేణిలోని బొగ్గు గనిలో పైకప్పు కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ఘటనపై పూర్తిస్థాయి స్పష్టత రావడం లేదని అన్నారు.
నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బొగ్గు గని శిథిలాల నుంచి బదిలీ వర్కర్ రవీందర్ను వెలికి తీశారు. అనంతరం వెంటనే ఆస్పత్రికి తరలించారు.
శిథిలాలను యంత్రాల ద్వారా తొలగిస్తే అందులో చిక్కుకుపోయిన వారికి గాయాలు, ప్రాణనష్టం జరుగుతుందేమోనన్న ఉద్దేశ్యంతో మ్యానువల్గానే శిథిలాలను తొలగిస్తున్నారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు పనిచేస్తుండగా ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు రాగా ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు..తొలుత వారు మరణించారని ప్రచారం జరిగింది.
రెస్క్యూ టీం నిన్నటి నుంచి సహాయక చర్యలు చేపట్టి ఇప్పటివరకు ముగ్గురిని బయటికి తీసుకురాగలిగారు. వీరయ్య, పిల్లి నరేష్, జాడి వెంకటేశ్వర్లును కాపాడగలిగారు.
శిథిలాల కింద ఏరియా సేఫ్టీ మేనేజర్ జయరాజ్, అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, ఒప్పంద కార్మికుడు శ్రీకాంత్లను బయటికి తీసుకు రావడానికి రెస్య్కూ టీం కృషిచేస్తోంది. ఈ నేపథ్యంలో గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.