ఛత్తీస్గఢ్లోని జష్ పూర్ లో లఖీంపూర్ తరహా ఘటన చోటు చేసుకుంది. దసరా వేడుకల్లో భాగంగా దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా వెళుతున్న భక్తులపైకి.. వెనకవైపు నుంచి వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఇప్పటివరకు ఒకరు మరణించగా, మరో 20 మందికి మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను రాయగఢ్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
భక్తులంతా భక్తి పారవశ్యంతో నిమజ్జన ఊరేగింపులో లీనమై విగ్రహం నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్తుండగా..హఠాత్తుగా ఓ కారు భక్తులపై దూసుకెళ్లింది. దీంతో భక్తులు కారు బానెట్ పై నుంచి ఎగిరి చెల్లాచెదురుగా పడ్డారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో వెనుక నుండి వస్తున్న కారు భక్తులను ఢీకొట్టి అలానే ముందుకు దూసుకుపోయినట్టు ఉంది.
ఈ ఘటనతో భక్తులు కోపోద్రికులై కారులోని వ్యక్తులను పట్టుకుని చితకబాదారు. కారును తగులబెట్టేశారు. కారులో గంజాయి తరలిస్తున్నారనే అనుమానంతో పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా తప్పించుకునేందుకు వేగంగా నడుపుతూ భక్తులపై దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
కాగా..ఈ ఘటనపై స్పందించిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ నిందితులను వెంటనే అరెస్టు చేసి విచారణకు ఆదేశించామని చెప్పారు. జష్పూర్ సంఘటన చాలా బాధాకరమైనది, హృదయాన్ని కలచివేస్తుందని అన్నారు.