దేశ ప్రజల కోసం లక్షలాది మంది డాక్టర్లు, ఆసుపత్రులు అందిస్తున్న నిరంతర సేవలకు గుర్తింపు, గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం 1991 నుంచి ఏటా జులై 1న నేషనల్ డాక్టర్స్ డే నిర్వహిస్తోంది.
పేదల వైద్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ ఫిజీషియన్, పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి జులై 1 కావడంతో ఆయన జ్ఞాపకార్థం ఈ రోజును నేషనల్ డాక్టర్స్ డేగా పాటిస్తోంది.
జాతిపిత మహాత్మా గాంధీకి స్నేహితుడైన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్.. ఆయనకు వ్యక్తిగత వైద్యుడిగానూ వ్యవహరించారు. కేంద్రం ఆయన్ను 1961లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’తో సత్కరించింది.
వైద్య వృత్తికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకోవడంతోపాటు వృత్తి నిబద్ధత, వైద్య రంగంలో మానవతా విలువల పెంపు కోసం నేషనల్ డాక్టర్స్ డేను కేంద్రం అమలు చేస్తోంది.
ఈ ఏడాది డాక్టర్స్ డే థీమ్ ‘హీలింగ్ హ్యాండ్స్.. కేరింగ్ హార్ట్స్’. వ్యాధులు లేదా అనారోగ్యంతో సతమతమయ్యే రోగులకు సాంత్వన చేకూర్చడంలో వైద్యులు పోషించే పాత్రను తెలియజెప్పడం ఈ థీమ్ ఉద్దేశం.