“కేజీఎఫ్” చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం “కేజీఎఫ్-2” చిత్రంతో బిజీగా ఉన్నాడు. కల్ట్ మూవీగా అభివర్ణించబడిన ఈ చిత్రం లాక్డౌన్ వలన ఈ ఏడాది చిత్రం విడుదల కావడం అసాధ్యంగా కనిపిస్తుంది. అయితే దాదాపు 70 శాతం చిత్ర షూటింగ్ పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ మరి కొద్ది రోజులలో ఈ చిత్రానికి ప్యాకప్ చెప్పనున్నాడు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్తో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. మే 20న ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దర్శకుడు ప్రశాంత్నీల్ చేసిన ట్వీట్ దక్షిణాది సినీవర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ‘మీరు పక్కనుంటే న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర కూర్చున్న భావన కలుగుతుంది. త్వరలో రేడియేషన్ సూట్ ధరించి మీ వద్దకు రాబోతున్నా’ అని ప్రశాంత్నీల్ కామెంట్ చేశాడు. అలానే జూన్ 4న ప్రశాంత్ నీల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ ‘గొప్ప మనసు కలిగిన సంచలన దర్శకుడికి శుభాకాంక్షలు. త్వరలో మిమ్మల్ని రేడియేషన్ సూట్లో కలవబోతున్నాం’ అని తమ అధికారిక ఖాతాలో ట్వీట్ చేయడం మరింత ఉత్కంఠను రేపింది. రెండు ట్వీట్లని బట్టి చూస్తుంటే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చిత్రానికి రేడియేషన్ అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
previous post
next post