telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల .. నోటిఫికేషన్లు విడుదల ..

notification released for ward secretariat

ఏపీ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి విడివిడిగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్లు విడుదల చేసింది. అన్ని రకాల విభాగాల్లో కలిపి మొత్తం 1,28,589 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులు భర్తీ చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా 11,114 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌ -4), గ్రామ రెవెన్యూ అధికారి (గ్రేడ్‌-2), ఏఎన్‌ఎం (గ్రేడ్‌-3), పశుసంవర్ధక, మత్స్య, ఉద్యాన, వ్యవసాయ, పట్టుపరిశ్రమ సహాయకుల పోస్టులను స్థానిక అవసరాలకు అనుగుణంగా భర్తీ చేస్తారు.

మహిళా పోలీసు, ఇంజినీరింగ్‌ సహాయకుడు, డిజిటల్‌ సహాయకుడు, గ్రామ సర్వేయరు, సంక్షేమ విద్యా సహాయకుడు పోస్టులన్నీ గ్రామ సచివాలయాల ఏర్పాటుకు తగినట్లు పూర్తిస్థాయిలో భర్తీ చేయనున్నారు. జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) ద్వారా ఈ నియామకాలు జరుగుతాయి. ఇన్‌సర్వీస్‌ ఉద్యోగులకు 10 శాతం మార్కుల వెయిటేజి ఇస్తారు. ఒప్పంద, పొరుగుసేవల కింద ఇప్పటికే పనిచేస్తూ అదే పోస్టులకు దరఖాస్తుచేసేవారికి ఈ అవకాశం లభిస్తుంది.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 2న విధుల్లో చేరతారు. వారికి రెండేళ్లపాటు ప్రొబేషనరీ పీరియడ్‌గా ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.15 వేల చొప్పున వేతనం చెల్లిస్తారు. ఆ తర్వాత శాశ్వత పేస్కేలు వర్తింపజేస్తారు. వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకానికి రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో సెప్టెంబరు మొదటి వారంలో జరుగుతుంది. సెప్టెంబరు మూడో వారంలో ఫలితాలు ప్రకటిస్తారు. అదే నెల నాలుగోవారంలో నియామకపత్రాలు అందజేస్తారు.

Related posts