ఏపీలో 13 కొత్త జిల్లాలకు రంగం సిద్ధం
నేడో రేపో నోటీఫికేషన్..ఉగాది నాటికి ప్రక్రియ పూర్తి..
ఏపీలో 26కు పెరగనున్న మొత్తం జిల్లాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రంగం సిద్ధం అయ్యింది. దీనిపై ప్రభుత్వం నేడో రేపో నోటిఫికేషన్ను జారీచేయనుంది. ఉగాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తిచేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో కొత్త జిల్లాలను అతిత్వరలో ఏర్పాటుచేయనుంది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలతో పాటు మరో జిల్లాను ఏర్పాటుచేయనుంది. గిరిజన ప్రాంతమైన అరకు పార్లమెంట్ నియోజకవర్గంను మాత్రం రెండు జిల్లాలుగా కాబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 25 లోక్సభ నియోజకవర్గాలుండగా.. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు పెరగనుంది.
పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలంటే..ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమని ప్రభుత్వం ఆలోచన. అందుకు అనుగుణంగా ఈ ప్రక్రియకు అన్ని విధాలుగా సిద్ధమవుతోంది.
ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి. క్రిష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు వున్నాయి. ఈ జిల్లాల్లో మరో లోక్ సభ నియోజకవర్గం జిల్లా కానుంది. దీనికి సంబంధించి అన్ని పనులు ముగిశాయని, సరిహద్దులు అన్నింటిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.