telugu navyamedia
సామాజిక

ఈ ఏడాది ఇద్దరికి నోబెల్ శాంతి బహుమతి

ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇద్దరిని వరించింది. ప్రజాస్వామ్యానికి మూలమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి గానూ జర్నలిస్టులు మరియా రెసా(ఫిలిప్పీన్స్‌), దిమిత్రి మురాటోవ్‌(రష్యా) వీరిద్దరికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు నోబెల్‌ కమిటీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛకోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని కమిటీ ప్రశంసించింది.

తమ దేశంలో నానాటికీ పెరుగుతున్న అధికార దుర్వినియోగం, హింసను తన కలంతో ప్రపంచానికి తెలియజేశారు ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు మరియా రెసా. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం కోసం 2012లో ఆమె ‘రాప్లర్‌’ పేరుతో ఓ డిజిటల్‌ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్‌ సీఈవోగా ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధికార పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం మరియా రెసా పోరాడుతూ వస్తున్నారు.

మీడియా స్వేచ్ఛ కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు రష్యాకు చెందిన ప్రముఖ జర్నలిస్టు దిమిత్రి మురాటోవ్‌. రష్యాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక నొవాజా గజెటా వ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకరు. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. ఈ పత్రికను ప్రారంభించిప్పటి నుంచి తమ దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలు ప్రచురించారు. దీంతో ఎన్నోసార్లు ఈ పత్రికకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ సంస్థకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అయినప్పటికీ మురాటోవ్‌ వెనుకడుగు వేయకుండా తమ సిద్ధాంతాలను పాటిస్తూ వస్తున్నారు.

Related posts