నేడు, రేపు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమ్మె ప్రభావం తన రాష్ట్రంపై ఉండదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. గతంలో ఈ రాష్ట్రంలో ఏదేదో జరిగినా, తన ఇలాఖాలో అలాంటివి ఒప్పుకునేది లేదని ఆమె నేటి కార్మికుల సమ్మె గురించి స్పందించారు. అయితే, మంగళవారం నుంచి రెండు రోజులపాటు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏక పక్షంగా ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధాలను అనుసరిస్తోందని ఆరోపిస్తూ సమ్మె చేస్తున్నారు. దాదాపు 10 జాతీయ కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా సమ్మెకు దిగగా.. పశ్చిమ్ బంగాల్లోనూ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని కోల్కతాలో సమ్మెకు దిగిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో ఈ సమ్మె ప్రభావం లేదని పశ్చిమ్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనడం గమనార్హం.
మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘నేను దీనిపై ఏమీ మాట్లాడదల్చుకోలేదు. పశ్చిమ్ బంగాల్లో మేం ఎలాంటి బంద్నూ ప్రోత్సహించడం లేదు. గతంలో అయిందేదో అయిపోయింది. 34 ఏళ్ల వామపక్ష పాలనలో రాష్ట్రాన్ని బంద్ల పేరుతో నాశనం చేశారు. ఇకపై బంద్ ఏమీ ఉండదు.’’ అని మమత విలేకరులతో అన్నారు. బంద్ జరగనున్న రోజులలో కార్మికులకు సాధారణ సెలవులు పెట్టుకొనే వెసులుబాటును రద్దు చేస్తున్నట్లు గత వారం ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల అవసరార్థం మంగళ, బుధ వారాల్లో నగరాలలో 500 వరకూ అదనపు బస్సులను తిప్పుతామని సోమవారం ప్రకటించారు. బంద్ సందర్భంగా ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా అదనపు పోలీసు బలగాలను ప్రధాన నగరాలలో మోహరించినట్లు పోలీసులు తెలిపారు. షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సముదాయాలు, రవాణా వ్యవస్థ సాధారణంగానే ఉందని పోలీసులు తెలిపారు.
తిత్లీ తుపాను హామీ మర్చిపోయారా జగన్ గారూ: లోకేశ్