దేశంలో ఆర్థిక పరిస్థితులు నెమ్మదిగా ఉన్నాయి తప్ప ఆర్థిక లోటు లాంటి పరిస్థితులు లేనేలేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా యూపీఏ ప్రభుత్వానికి, ఎన్డీయే ప్రభుత్వం మధ్య వ్యత్యాసం గురించి లెక్కలతో సహా వివరించారు.
2009-14న యూపీఏ హయాంలో 189.5 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే అదే భాజపా హయాంలో ఆ సంఖ్య 284.9 బిలియన్ డాలర్లకు పెరిగిందని చెప్పారు. అదే సమయంలో విదేశీ మారక నిల్వలు సైతం 304.2 బిలియన్ డాలర్ల నుంచి 412.6 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు చెప్పారు. దేశంలో ఆర్థిక మందగనం పరిస్థితులే ఉన్నాయి తప్ప.. ఎలాంటి మాంద్యం లేదు.. ఉండబోదని సీతారామన్ అన్నారు. సంక్షోభంలో ఉన్న బ్యాంకింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు. అలాగే 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను అందుకునేందుకు 32 చర్యలు తీసుకున్నట్లు వివరించారు. సీతారామన్ సమాధానంపై సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేశారు.