తెలంగాణలో ఎంపీ స్థానాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయని శాసనసభ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయాపార్టీలతో పొత్తులపై రాష్ట్ర కమిటీలో చర్చించి నివేదిక అధిష్టానానికి పంపుతామని, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. నెలాఖర్లోగా పార్లమెంట్ ఎన్నికల పొత్తులపై క్లారిటీ వస్తుందని, వెంటనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటిస్తుందన్నారు.
రాష్ట్రంలో ఎర్రజొన్న ,పసుపు రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని, ఎర్రజొన్నలను కోనుగోలు చేశామని ప్రభుత్వం చెబుతున్న మాటలు అవాస్తమని విమర్శించారు. ఎర్రజొన్నకు రూ.3 వేలు, పసుపునకు రూ.10 వేల మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు పెట్టిస్తామన్న ఎంపీ కవిత మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుతోనే వ్యవసాయ రంగం దిగజారిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.