రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. మార్చి 22న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి గత కొద్ది రోజులుగా జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నాడు వర్మ. ఇప్పటికే చిత్రానికి సంబంధించి రెండు ట్రైలర్స్ విడుదల చేసిన వర్మ పలు వీడియో సాంగ్స్ కూడా రిలీజ్ చేశాడు. వీటితో సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అయితే ఈ చిత్రం పలు వివాదాంశాలతో తెరకెక్కించారని , సినిమా విడుదలని ఆపేయాలని ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీడీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మార్చి 22న విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర రిలీజ్ని అడ్డుకోలేమని తేల్చి చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ సినిమా విడుదలైన తరువాతే చర్యలు తీసుకునే అవకాశం ఉందని.. నిజంగా ఓటర్లను ప్రభావితం చేసే సన్నివేశాలు ఆ సినిమాలో ఉంటే రిలీజ్ తరువాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈసీ. దీనితో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్కి అడ్డంకులు తొలగిపోయాయి.
మార్చి 22న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియపరచాడు. అయితే ఈ చిత్రానికి ఒకవేళ అడ్డంకులు ఎదురైన యూట్యూబ్లో రిలీజ్ చేసి తీరతానని వర్మ శపథం చేసిన సంగతి తెలిసిందే. తాను చచ్చినా కూడా ఈ సినిమా ఆగదు అని వర్మ కొద్ది రోజుల క్రితం సంచలన కామెంట్స్ చేశారు.