ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సోదరి పూర్వీ మోదీ, బావ మయాంక్ మెహతాకు చెందిన కంపెనీ పెవిలియన్ పాయింట్ కార్పొరేషన్కు సంబంధించిన సింగపూర్ బ్యాంక్ ఖాతాల్లోని రూ.44.41కోట్లను స్తంభింపజేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ఈ మేరకు సింగపూర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈడీ వినతి మేరకే అక్కడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే నీరవ్, పూర్వీ, మయాంక్ స్విస్ ఖాతాలను సైతం స్తంభింపజేసిన విషయం తెలిసిందే.
నీరవ్ మోదీ పలుమార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. తిరిగి లొంగిపోడేమో అనుమానంతో బెయిల్ ఇవ్వడానికి అక్కడి న్యాయమూర్తులు నిరాకరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం యూకే చట్టాల ప్రకారం ఆయనపై విచారణ కొనసాగుతోంది. రూ.13 వేల కోట్ల పీఎన్బీ కుంభకోణం కేసులో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. నీరవ్, మెహుల్ ఛోక్సీ సహా వారికి చెందిన సహచరులు పీఎన్బీని మోసగించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నం చేసినట్లు అభియోగపత్రంలో ఈడీ పేర్కొంది. పీఎన్బీ కుంభకోణం బయటపడే నెలరోజుల ముందే వీరంతా విదేశాలకు పారిపోయారు. నీరవ్ మోదీ లండన్లో తలదాచుకుంటుండగా.. అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైల్లో ఉంచారు.