గత ప్రభుత్వం నిప్పులవాగు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వెలుగోడు మండలం వేల్పనూరు, అబ్దుల్లాపరం, గుంతకందాల గ్రామాలకు చెందిన 37 మంది రైతుల నుంచి దాదాపు 100 ఎకరాల భూములను ప్రభుత్వం 2015లో సేకరించింది. వీరికి రూ.91.70 లక్షలు పరిహారం చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించాల్సి ఉంది. పునరావాసం సంగతి దేవుడెరుగు… పరిహారం ఇవ్వండంటూ కోరినా గత ప్రభుత్వం విస్మరించింది. 2016 జనవరిలో అవార్డు ద్వారా నీటిపారుదల శాఖ అధికారులు భూములు స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన భూములకు పరిహారం విడుదల చేసేందుకు 2018 నవంబరు 30న కర్నూలు ఆర్డీవో బిల్లులను పే అండ్ అకౌంట్స్ అధికారికి సమర్పించారు. మరుసటి రోజునే పీఏఓ బిల్లు ఐడీ నెంబరు 904684 ద్వారా సీఎఫ్ఎంఎస్ విధానంలో ఆర్బీఐకి పంపారు.
అయితే నెలలు గడచిపోతున్నా రైతుల భూసేకరణ బిల్లులకు మోక్షం లభించలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ భూసేకరణ బిల్లులను ఆర్థిక శాఖ ప్రిన్స్పల్ సెక్రటరీ ఉద్దేశ పూర్వకంగా పెండింగ్లో ఉంచినట్లు స్పష్టమవుతంది. సీఎప్ఎంఎస్ విధానంలో ముందు వెళ్లిన బిల్లులకు ముందుగా నగదు వారి ఖాతాలకు జమ చేయాలి. టీడీపీ హయాంలో ఈ భూసేకరణ బిల్లులను పక్కన పెట్టి కాంట్రాక్టర్ల చెల్లింపు బిల్లులు ఆమోదం పొందాయి. భూములు కోల్పోయిన రైతుల గురించి పట్టించుకోవడం లేదు. భూము లు కోల్పోయిన వారందరూ సన్న, చిన్న కారు రైతులే. పరిహారం కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. న్యాయం కోసం తమ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు.