ఏపీ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఎన్నికలను సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచనలు ఇస్తున్నారు. ఇక సీఎస్కు వరుసగా లేఖలు పంపి.. రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పుతున్న ఆయన తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇంటింటికి రేషన్ సరఫరా వాహనాల వినియోగంపై ఎస్ఈసీ ఆంక్షలు విధించారు. రేషన్ సరఫరా వాహానాలకు రంగులు మార్చాలని ఆదేశించారు. ఏ పార్టీలకు చెందని రంగులు వేసి కమిషన్ పరిశీలనకు తీసుకురావాలని సివిల్ సప్లైస్ శాఖ ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. అప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ సరఫరా వాహానాల వినియోగం నిలిపేయాలని ఎస్ఈసీ ఆదేశించారు. ఇక ఆయన మొన్ననే పౌర సరఫరాల శాఖ రేషన్ డెలివరీ వాహనాలను తనిఖీ చేసారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆఫీసుకు రేషన్ డెలివరీ వాహనాలను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వాహనానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు నిమ్మగడ్జ. వెహికల్ కెపాసిటీ.. డెలివరీ విధానంపై ఎస్ఈసీ ఆరా తీశారు. వాహనాల తనిఖీ అనంతరం సివిల్ సప్లైస్ శాఖ అధికారులతో నిమ్మగడ్డ భేటీ అయ్యారు.